సప్తనదీ సంగమం గా వర్ధిల్లుతున్న పవిత్ర స్థలం సంగమేశ్వర క్షేత్రం

సప్తనదీ సంగమం గా వర్ధిల్లుతున్న పవిత్ర స్థలం సంగమేశ్వర క్షేత్రం

క్యాపిటల్ వాయిస్, భక్తి సమాచారం :- ఏకంగా ఏడు నదులు కలిసే ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. ప్రపంచంలో ఎక్కడా  ఏడు నదులు కలిసి ఉన్న పుణ్యక్షేత్రం మరొకటి లేదు.  ఆలయానికి మరో విశిష్టత ఏమిటంటే శివయ్య దంపతులు ఏడాదిలో 7 నెలల పాటు నీటిలో ఉండి.. కేవలం 5 నెలలు మాత్రమే భక్తులకు దర్శనం ఇస్తారు.  వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్ర స్థలం సంగమేశ్వర క్షేత్రం.  ఎందరో మునులు తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం.  ఆత్మకూరు పట్టణానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో నల్లమల అటవీ ప్రాంతం సమీపంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. సప్తనదీ సంగమంగా పిలువబడే ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం … నివృత్తి సంగమేశ్వరాలయం గా  ప్రసిద్ధికెక్కింది.

కూడలి సంగమేశ్వరాలయం నిర్మాణానంతరం చాళుక్యులు ఇక్కడ మరిన్ని ఆలయాలను నిర్మించాలనుకున్నారు. కానీ వరద సమయంలో ఆలయంలోకి ఒండ్రు మట్టి చేరుతున్నందున మరో ప్రాంతంలో ఆలయాలు నిర్మించాలని అన్వేషించగా, అలంపురం అనువుగా కనిపించింది. తుంగభద్ర నది ఉత్తర వాహిని కావడం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జోగులాంబ క్షేత్రం ఉండటం వల్ల, జమదగ్ని ఆశ్రమం ఉండడం వల్ల
ఇక్కడ నవ బ్రహ్మాలయాల సముదాయాన్ని నిర్మించారు. అవి పట్టాడకల్ లోని గలగనాధ, పాపనాధ, ఆలయాలను పోలి వుంటాయి. కాలక్రమాన చాళుక్యుల ప్రాభవం తగ్గసాగింది. రాష్ట్రకూటుల ప్రాభవం పెరిగింది. వీరు పల్లవులతో సంబంధ బాంధవ్యాలు నెరపి చాళుక్యులను జయించారు. ఆ విజయానికి గుర్తుగా ఎల్లోరాలో కొండను తొలిచి కైలాశనాధాలయాన్ని నిర్మించారు. ఇక మొలక సీమ వైపు చూస్తే ‘నివృత్తి సంగమం’ కనిపిస్తుంది. అహోబిలం కొండల్లో పుట్టిన సెలయేరు భవనాశిని నదిగా రూపాంతరం చెంది కృష్ణ లో కలిసే స్థలమది. ఈ నది కృష్ణ లో కలిసే ఏడవ నది అయినందున దీనిని సప్తమ నదీ సంగమమని సప్తనది సంగమేశ్వరమనీ వ్యవహరిస్తారు. ప్రజల పాప ప్రక్షాళన చేసిన గంగాదేవికి జనుల పాప ప్రక్షాళన చేసిన గంగా దేవికి కాకి రూపం రాగా, ఈ సంగమంలో స్నానం చేసి హంసగా మారిందని, ఆమె పాపాలు నివృత్తి అయినందున దీనికి నివృత్తి సంగమేశ్వరం అని పేరొచ్చిందని ఒక కథనం. ఆరణ్య వాస సమయంలో ఇక్కడ ధర్మరాజు లింగ ప్రతిష్ట చేయాలని సంకల్పించి లింగాల కోసం భీముణ్ణి కాశీకి పంపగా, సమయానికి తిరిగి రానందున వేప మొద్దును శివలింగంగా ప్రతిష్టించాడని ఒక కథ ప్రచారంలో ఉంది.కోస్తా తీర ప్రాంతంలో పంచారామాలుండగా ఇక్కడ మల్లేశ్వరం, అమరేశ్వరం,సిద్దేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరం పేర్లతో పంచేశ్వరాలు ఏర్పడ్డాయని,ఇవన్నీ భీముడు తెచ్చిన లింగాలపై వెలిశాయని మరొక కథనం.

స్థల పురాణం ….
పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో… ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని స్థలపురాణం చెబుతోంది.సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయం గా ప్రసిద్ధి కెక్కింది. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించాడు. ధర్మరాజు ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు .. ప్రతిష్ట సమయానికి రాలేదు. రుషుల సూచన మేరకు వేప మొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్టించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింపజేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్టించి, భీమ లింగం గా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెప్తోంది.

ప్రపంచంలో 7 నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం లో తుంగభద్ర, క్రిష్ణ, వేణి, భీమా, మలాపహరిణి, భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరం అంటున్నారు. ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది, మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే.భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి.ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలసిపోతాయి.

ప్రస్తుత ఆలయ పరిస్థితి…..

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమైపోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు నిర్మించారు. సుమారు లక్షా ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు, చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్ధమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపుర ద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. కానీ, ప్రస్తుతం అవేమీ కనిపించవు.ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమై పోగా… అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. శివుడి వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీలలితాదేవి, కుడి వైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకు ముందు వారిద్దరికీ వేరు వేరు
ఆలయాలు ఉండేవి. అయితే, అవి శిథిలమై పోవడం తో లలితాదేవి, గణపతులను గర్భాలయంలో ప్రతిష్టించారు. అన్ని ఆలయాల్లో లాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగి ఉండడమే కారణం. మరో గొప్ప విషయం ఏంటంటే.. వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్టించిన వేప లింగం ఇప్పటికీ చెక్కుచెదరక పోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించక మానదు.

ఎలా చేరుకోవాలి …..
కర్నూలు నుంచి 95 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరవచ్చు. ప్రధానంగా ఆత్మకూరు నుండి సంగమేశ్వరానికి ఆటోలు,జీపులలో వెళ్ళవచ్చు. కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి కపిలేశ్వరమునకు బస్సులో చేరుకుని అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి ఆటోలు, జీపులలో చేరవచ్చు. సొంత వాహనాల్లో వెళ్ళేవారు ఏ దారిలో నైనా సరాసరి ఆలయం వరకు వెళ్ళవచ్చు. తెలంగాణ నుంచి సోమశిల వచ్చి సోమశిల నుంచి పడవల్లో సంగమేశ్వరం చేరుకోవచ్చు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాటికి ఈ క్షేత్రం బయటపడితే క్షేత్రానికి వివిధ ప్రాంతాలనుంచి ఆర్‌.టి.సి.వారు బస్సులను నడుపుతారు. తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకు
బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చు.

0Shares
Categories: , ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *