క్యాపిటల్ వాయిస్, విద్యా సమాచారం :- ప్రస్తుతం సాంకేతిక విద్యకు ప్రాధాన్యం పెరుగుతోంది. సాంకేతిక నైపుణ్యాలు కలిగిన వారే త్వరగా ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పదో తరగతి తర్వాత ఏం చేయాలి? ఏ కోర్సులను ఎంచుకుంటే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వంటి ప్రశ్నలతో ఇప్పటి నుంచే విద్యార్థులు ఆలోచిస్తుంటారు. వెంటనే ఉపాధి అవకాశాలు పొందాలంటే పాలిటెక్నిక్ కోర్సులు మంచి ఆప్షన్. టెన్త్ తోనే ఇంజనీర్ అయ్యే అవకాశం పొందవచ్చు. ఇందుకోసం పాలిసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పాలిసెట్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. ఆసక్తిగల విద్యార్థులు పాలిసెట్ ఎంట్రన్స్ లో ర్యాంకు సాధించి సీటు పొందవచ్చు. ప్రస్తుతం పాలిటెక్నిక్ కోర్సులకు మంచి ఆదరణ ఉంది. తక్కువ ఖర్చుతో మెరుగైన ఉపాధి పొందేందుకు ఈ కోర్సులు దోహదం చేస్తాయి. ఈ కోర్సులు చేసిన వారికి కార్పొరేట్ కంపెనీలు రెడ్ కార్పెట్లు పరుస్తున్నాయి. పాలిటెక్నిక్ కోర్సుల్లో ఏయే బ్రాంచీలు ఉన్నాయో ఒకసారి చూద్దాం..
కోర్సులు- బ్రాంచీలు…
పాలిసెట్ ద్వారా 30కిపైగా కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. విద్యార్థులు వారి ఆసక్తి, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆయా కోర్సులను ఎంచుకోవడం ఉత్తమం. వీటిలో కొన్ని మూడేళ్ల కోర్సులైతే మరికొన్ని మూడున్న రేళ్ల కోర్సులు ఉన్నాయి.
పాలిటెక్నిక్ నుంచి ఇంజినీరింగ్ : ఈ కోర్సు చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో ఇంజనీరింగ్ కు మార్గం సుగమం అవుతుంది. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు పూర్తయ్యాక ఈసెట్ రాసి నేరుగా ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో చేరొచ్చు. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రాక్టికల్సు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కావున ఈ కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులు నైపుణ్యం పొందడం ద్వారా కంపెనీల్లో త్వరగా షైన్ అవుతారు. పాలిటెక్నిక్ లో చదివిన సబ్జెక్టులే ఇంజనీరింగ్ లో ఉంటాయి కావున పాలిటెక్నిక్ తర్వాత ఇంజనీరింగ్ చేస్తే సబ్జెక్టులపై ఈజీగా పట్టు సాధించవచ్చు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కంటే పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వారికి కంపెనీలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి.