రస్నా గుర్తుందా… !?
సమ్మర్ వచ్చిందంటే టేస్టీ టేస్టీ రస్నా తాగాల్సిందే. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎంతున్నా పరిగెత్తుకుంటూ షాప్ కెళ్లేవాళ్లం. రస్నా ప్యాకెట్లు కొనేవాళ్లం. అందులోని తెల్లటి పొడిని నీళ్లలో కలపగానే నీళ్లు నారింజ రంగులోకి మారిపోయేవి. అందులో చక్కెర కలుపుకొని తాగితే.. చల్లగా, ఎంతో కమ్మగా అనిపించేది. నిమ్మకాయలతో ఇంట్లోనే ఉండి షర్బత్ చేసుకొని తాగిన రోజులు కూడా ఇప్పుడు కనుమరుగయ్యాయి.

సాయంత్రమైతే..!!
సాయంకాలం ఊళ్లోని పిల్లలతో కలిసి మైదానానికి చేరుకుని ఆటల్లో మునిగిపోయేవాళ్లం. వాతావరణం చల్లబడినా అది ఎండాకాలం కదా చెమటలు జలపాతాల్లా కారేవి. చీకటి పడేంత వరకు ఆడుతూనే ఉండేవాళ్లం. ఇంటికెళ్లి స్నానం చేయగానే హాయిగా అనిపించేది. ఇక పడుకునేది ఆరుబయటే కాబట్టి చల్లటి గాలి వీచేది. పెద్దలే పిల్లల్లాగా అరుగుపై కూర్చొని పులిమేక, అష్టాచమ్మ ఆడేవాళ్లు. ఊరి ముచ్చట్లంతా చెప్పుకునేవారు. ఆకాశంలో నక్షత్రాలు, చెట్లపై పక్షుల కూతలు, కొద్ది దూరంలోనే పశువుల పాకలు, గోవుల మెడల గంటల చప్పుడు.. అవేవీ నిద్రకు ఆటంకం కలిగించేవి కాదు. పైగా అవే మనల్ని నిద్రపుచ్చేవి.
అమ్మమ్మ ఊరు… !!
పరీక్షలు అయిపోగానే బ్యాగులు సర్దడం, కొత్త బట్టలు తీయడం.. అబ్బో ఆ హడావిడి అంతా ఇంతా కాదు. ఎందుకంటే అమ్మమ్మ ఊరికి వెళ్లాలి కదా! రొటీన్ జీవితాన్ని అమ్మమ్మ ఊరు కలర్ఫుల్ చేసేది. స్వచ్ఛమైన గాలి, పక్షుల కిలకిల రావాలు ఊర్లోకి ఆహ్వానించేవి. సొంతూర్లో కన్నా.. అమ్మమ్మగారి ఊర్లోనే స్నేహితులు ఎక్కువ ఉండేవారు. అందరం కలిసి ఆడుకునేవాళ్లం. ప్రతిరోజు రాత్రి అమ్మమ్మ కథలు చెప్పేది. ఎండాకాలం సెలవులు అయిపోతున్నాయంటే ముందుగానే అమ్మమ్మ మనకోసం ఊరగాయలు, వడియాలు, అప్పడాలు చేసిచ్చేది. వాటిని బ్యాగు నిండా నింపిచ్చేది. అక్కడి నుంచి ఊరికి రావాలంటే చాలా బాధగా ఉండేది. అమ్మమ్మను, ఆ ఊరిని వదిలి రావడానికి మనసొప్పేది కాదు.
అబ్బా! ఎన్ని తిన్నాం…. !!
వేసవి అంటే అన్నింటికన్నా ముందు గుర్తొచ్చేది మామిడి పళ్లు. ఫ్రెండ్స్ కలిసి తోటకు వెళ్లి దొంగతనంగా తెంపుకొచ్చుకునేవాళ్లం. నేరుగా చెట్టుమీద పండిన మామిడి పళ్లను తింటుంటే.. ఆహా! అమృతంలాగా ఉండేది. మామిడి పండ్లే కాదండోయ్.. చెరువు గట్లపై ఉండే ఈతకాయలూ టేస్టీగానే ఉండేవి. పచ్చి ఈత గెలల్ని తెంచుకొని గడ్డివాములో మగ్గపెట్టి అవి పండాక తినేవాళ్లం. సీమ చింతకాయల కోసం ఊరి వెనకున్న వనమంతా గాలించేవాళ్లం. బాదం కాయలను ఎంతో ఇష్టంతో తినేవాళ్లం. చింతకాయలను చప్పరించి పులకరించిపోయేవాళ్లం. పుచ్చకాయలు, కర్బూజాలు, సపోటాలు అన్నీ వేసవిలోనే దొరికేవి. నమ్మరేమో గానీ, పసుపు రంగులో ఉండే వేప పండ్లు కూడా యమ తియ్యగా ఉండేవి. మొర్రి పండ్లు అనేవి కూడా ఉండేవి. అడవిలో నుంచి తెంపుకొచ్చి ఊర్లో రూపాయికి డబ్బాల్లాగా అమ్మేవాళ్లు. వాటిని తిన్నాక ఆ గింజలను ఎండబెట్టి.. వాటిని పగులగొట్టి ఆ పలుకులను కూడా తినేవాళ్లం. ఇప్పుడు అంత ఓపిక ఎవరికి ఉండట్లేదు.
తాటి ముంజలు…. !!
తాటి ముంజల్ని ఎలా మర్చిపోయామా అనుకుంటున్నారా? అసలు తాటి ముంజలు లేని వేసవి సెలవులు ఉంటాయా చెప్పండి. అప్పట్లో ఇప్పటిలాగా ముదిరిపోయిన తాటి ముంజల్ని అమ్మేవారు కాదు. లేత తాటికాయల ముంజలను బొటన వేలితో నేరుగా నోట్లో వేసుకోవడం మధురమైన అనుభూతి. చిన్నప్పుడు ఇలా తినడం రాకపోయేది. ముంజలో నీరంతా మీద పడేది. ఇక తినడం అయ్యాక రెండు తాటికాయల మధ్య కర్ర గుచ్చి దాన్ని బండిలా తయారు చేసి, దాంతో ప్రింట్స్తో కలసి ఊరంతా తిరుగుతూ ఆడుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చేది.