మధుమేహ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి… ఎలాగో తెలుసుకుందామా !! 

మధుమేహ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి… ఎలాగో తెలుసుకుందామా !! 
క్యాపిటల్ వాయిస్,ఆరోగ్య సమాచారం :- ఈ రోజుల్లో షుగర్ వ్యాధి అనేది అతి పెద్ద ముప్పుగా మారింది. డయాబెటిస్ కేసులు దేశంలో భారీగా పెరుగుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలామంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. డయాబెటిస్ వచ్చిన వారి రక్తంలో షుగర్ లెవల్స్ హెచ్చు తగ్గులకు లోనవుతాయి. దీంతో శరీర కణాలకు శక్తి అందక అలసటగా అనిపిస్తుంది. డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఒక్కసారి వచ్చిందంటే, జీవితాంతం చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకునే ప్రయత్నాలు చేయాలి. డయాబెటిస్ రోగులు చాలా మంది షుగర్ లెవల్స్ తగ్గించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తూంటారు.ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నాన్ కమ్యూనికబుల్ (ఒకరి నుండి ఒకరికి సంక్రమించని వ్యాధి) వ్యాధుల్లో మధుమేహం అతి పెద్ద సమస్య. దీనిని షుగర్, డయాబెటిస్, చక్కెర వ్యాధి అని కూడా పిలుస్తారు. ప్రస్తుత కాలంలో ఏర్పడిన జీవన, ఆహారంలోని మార్పుల వల్ల సమాజంలో మధుమేహంతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 540 మిలియన్ల ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ సమస్య 2045 సంవత్సరం నాటికి ప్రతి ఎనిమిది మందిలో ఒక్కరికి ఉంటుందని, క్రమంగా మధుమేహంతో బాధపడే వారి సంఖ్య 783 మిలియన్లకు చేరుతుందని నిపుణుల అభిప్రాయం. దాదాపు 90% ప్రజలు టైప్-2 డయాబెటిస్ తో జీవిస్తున్నారు. మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్యలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది.
మధుమేహ లక్షణాలు: మధుమేహం అనేది మెటబాలిజం వలన కలిగే ఒక దీర్ఘకాలిక సమస్య. ఇన్సులిన్ ఉత్పత్తి, జన్యువులలో లోపాలు, శారీరక శ్రమ లేకపోవడం, స్థూలకాయం, జీవన, ఆహారపు అలవాట్లలో మార్పులు వంటి అనేక మధుమేహా కారణాలు ఉన్నాయి. ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో కారణం లేకుండా బరువు పెరగడం, అతిగా దాహం, ఆకలి వేయడం, అతిగా మూత్ర విసర్జన వంటి లక్షణాలు ఉంటాయి. మధుమేహం ఒక్కసారి వస్తే దానిని నియంత్రణలో ఉంచుకోవడం తప్ప పూర్తిగా నయం చేసే వీలుండదు. మధుమేహాన్ని సకాలంలో గుర్తించి నియంత్రించకపోతే, ఇతర కంటి, గుండె, నరాలు, మూత్రపిండ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మధుమేహాన్ని “సైలెంట్ కిల్లర్” గా పిలుస్తారు. ప్రతి సంవత్సరం మధుమేహం పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నవంబర్ 14వ తేదీ ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మధుమేహం గలవారు తక్కువ పిండి పదార్థాలు, ఎక్కువ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఆహారంలో తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

చిరుధాన్యాలు : ఇవి నిజానికి ఆరోగ్యాన్ని ఇచ్చే సిరి ధాన్యాలను చెప్పవచ్చు. గతంతో పోల్చితే ప్రజల్లో చిరుధాన్యాల పైన అవగాహన బాగా పెరిగింది. రోజువారీ ఆహారంలో మిల్లెట్స్ చేర్చుకోవాలని జాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థ కూడా సూచించింది. చిరుధాన్యాలను ఆహారంలో తీసుకోవడం ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహంతో బాధపడుతున్న వారికి మిల్లెట్స్ ఒక సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. వీటిలో ఉండే అధిక పీచు పదార్థాలు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, రక్తం లోని షుగర్ లెవల్స్ ని నియంత్రణలో ఉంచుతాయి.

ఈ విధంగా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, వీటిని రోజువారీ ఆహారంలో తీసుకునే వారి సంఖ్య చాలా తక్కువ అని చెప్పవచ్చు. ఎందుకంటే, చిరుధాన్యాలను ఎక్కువగా కాలం నిల్వ చేయడం, వండుకోవడం ఒక పెద్ద సవాలు. వీటిపై అవగాహన, ఆసక్తికరమైన ఉత్పత్తులు తయారు చేసే విధంగా యునైటెడ్ నేషన్స్ 2023 సంవత్సరం ని “ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్” గా గుర్తించింది. దీని ద్వారా చిరు ధాన్యాల ఉత్పత్తి భారతదేశంలో బాగా పెరిగింది. చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తులు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా మధుమేహం అనగానే అన్నం తినకూడదు, కేవలం గోధుమలు, రాగిజావ వంటివి మాత్రమే తీసుకోవాలని అంటారు. కానీ, అది కేవలం అపోహ మాత్రమే. అన్నం, గోధుమలు, చిరుధాన్యాల్లోనూ ఉండేవి పిండి పదార్థాలు మాత్రమే. కావున చిరుధాన్యాలను కూడా సరైన విధానంలో ప్రాసెసింగ్ చేయడం, సరైన మోతాదులో, సరైన పదార్థాలలో వాడటం ద్వారా వీటిలోని సంపూర్ణ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మార్కెట్లో లభించే అన్ని చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తులు మధుమేహంతో జీవించే వారికి ఉపయోగకరం కాదు. కావున వాటిని ఆహారంగా తీసుకునే ముందు గ్లైసిమిక్ ఇండెక్స్, గ్లైసిమిక్ లోడ్ అని రెండిటిని ప్రామాణికంగా చేసుకొని ఆహార పదార్థాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. 

ఉదాహరణ :- గ్లైసిమిక్ ఇండెక్స్ 0-55 ఉంటే తక్కువ, 55-69 ఉంటే మధ్యస్తం, 69-100 ఉంటే ఎక్కువ అని వర్గీకరించారు.చిరుధాన్యాలు, వివిధ చిరుధాన్యాల ఉత్పత్తుల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ అనగా 0-55 ఉండే ఫుడ్స్ ని మాత్రమే మధుమేహంతో జీవించేవారు తీసుకోవాలి. చిరుధాన్యాల ఉత్పత్తులలో ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటే వాటిని తీసుకోవడం ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదు. కావున సరైన ఆహార పద్ధతులలో పాటు వ్యాయామం, జీవన శైలిలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం ద్వారా మధుమేహం నివారణకు, నియంత్రణకు సహాయపడతాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top