మేమింతే….ఏ ప్రభుత్వం ఉన్నా మా ఆక్రమణకు అడ్డుండదు….!!

మేమింతే….ఏ ప్రభుత్వం ఉన్నా మా ఆక్రమణకు అడ్డుండదు….!!

# ప్రభుత్వం మారినా కారంపూడి లో ఆగని భూ ఆక్రమణలు !!
 # అధికారంలో ఏ పార్టీ ఉన్న కబ్జాదారులు మాత్రం వారే !!
# కారంపూడి మండలంలో భూ దందాలను అడ్డుకోవడంలో అనాశక్తి చూపుతున్న  అధికారులు !!
 క్యాపిటల్ వాయిస్, కారంపూడి :రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం వచ్చినా, కారంపూడి మండలంలో మాత్రం భూభకాసురులు తమ తీరును మార్చుకొనకుండా యదేచ్చగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటూనే ఉన్నారు. గత ఐదు సంవత్సరాల కాలంలో కారంపూడి పట్టణ సరిహద్దుల్లో ఉన్న ప్రభుత్వ భూములు, దేవాదాయ శాఖ భూములు, ఈనామ్ భూములు, ఇలా ఒకటనేమి ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ భూ బకాసురులు వాలిపోయి, తమకు తిరుగు లేదన్నట్లుగా భూములను ఆక్రమించుకొని లేఅవుట్లు వేసుకొని అమ్ముకుంటున్నా కూడా, అప్పటి ప్రభుత్వ అధికారులు ఇలాంటివి  తమకేమీ పట్టవన్నట్లు చూస్తూ, మామూళ్ల మత్తులో మైమర్చిపోయారని మండల ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అదే భూభకాసురులు కూటమి ప్రభుత్వంలో కూడా రెచ్చిపోతూ, ప్రభుత్వ భూములు, గ్రామ కంఠం భూములు దొరికినవి దొరికినట్లుగా ఆక్రమించుకుంటున్నా పంచాయతీ, మండల రెవెన్యూ అధికారులు కొందరు వారికి తొత్తులుగా మారి వారు భూదోపిడికి సహకరిస్తున్నట్లుగా కూడా కారంపూడి పట్టణ ప్రజలు ఘాటుగా విమర్శిస్తున్నారు. కారంపూడి నుండి దాచేపల్లి వెళ్లే ఆర్ అండ్ బి రహదారికి ఒకవైపునున్న ప్రభుత్వ భూమిలో గత కొన్నేళ్ల క్రితం వడియరాజులు రాళ్లను తీసే క్వారీగా ఉపయోగించుకున్న భూమి కూడా ప్రస్తుతం ఆక్రమణ కోరల్లో చిక్కుకుపోయి ఉందని ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నా సంబంధిత పంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు కారంపూడి పట్టణంలోని ఒడియ రాజులకు జీవనాధారమైన ఈ ప్రభుత్వ భూమిలో ఉన్న క్వారీ,కొన్ని వందల కుటుంబాలు జీవనోపాధిగా నిలిచిందని పెద్దలు చెప్తున్నారు. దాదాపుగా 15 నుండి 20 అడుగుల లోతున ఉన్న ఈ క్వారీ భూములను కూడా గత ప్రభుత్వ సమయంలోను, ప్రస్తుత కూటమి ప్రభుత్వ సమయంలోను యదేచ్చగా ఆక్రమించుకొని ఆ గుంతలను పూడ్చుకుని అక్రమ లేఅవుట్లను కూడా వేస్తున్న పంచాయతీ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఆక్రమణకు గురి అయిన భూముల వైపు కన్నెత్తి చూడటానికి కూడా జంకుతున్నారని కారంపూడి పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. కారంపూడి నుండి దాచేపల్లి వైపు వెళ్లే రహదారిలో రోడ్డుగా ఆనుకోని ఉన్న దాదాపుగా రెండు ఎకరాల భూమిని ఆక్రమించుకొని క్వారీ గుంతను గూర్చి లే అవుట్ కి సిద్ధం చేసిన ఒక్క అధికారి కూడా దానిని అడ్డుకున్న పాపాన పోలేదని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వ మారినా భూ ఆక్రమణదారుల్లో భయము, జంకు లేకుండా యదేచ్చగా తమ భూదందాను కొనసాగిస్తూనే ఉన్నారని కూటమి కార్యకర్తలు సైతం విమర్శలు చేయటం గమనార్హం. ఇప్పటికైనా పంచాయితీ, రెవెన్యూ అధికారులు తమ మామూళ్ల మత్తును వదిలించుకొని ఈ ప్రభుత్వ భూములను భూ ఆక్రమణదారుల వద్ద నుండి తిరిగి స్వాధీనం చేసుకోవాలని కూటమి నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు వీటిని ఎంతవరకు చేస్తారో వేచి చూడవలసిందే.
 తహసీల్దార్ వివరణ : – ఈ భూముల ఆక్రమణ  విషయమై కారంపూడి మండల తాసిల్దార్ ను వివరణ అడగగా మా దృష్టికి వచ్చిన ప్రతి ఆక్రమణను నిలిపివేసి, ఆయా ప్రభుత్వ భూములను సర్వే చేయించి హద్దులు పెట్టించామని, త్వరలో ఆ భూములు వద్ద బోర్డులు పెట్టిస్తామని చెప్పారు.
 అయితే తాసిల్దార్ సర్వే చేయించిన భూ కబ్జాదారులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ ప్రభుత్వ భూములలో  అక్రమ లేఅవుట్లను వేసి ప్రజలను మోసగించి, ప్రభుత్వానికి చందవలసిన లక్షలాది రూపాయలు ఈ అక్రమ లే అవుట్ ల ద్వారా కబ్జాదారులు పొందుతున్నారు. ఇప్పటికైనా గ్రామ కంఠం భూములను పంచాయతీ వారు, ప్రభుత్వ భూములను రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు స్వాధీనం చేసుకుని, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని గ్రామ, మండల ప్రజలు కోరుకుంటున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top