చెరువుల్లో నాచును పండిస్తున్న గోదావరి వాసులు !!

 

చెరువుల్లో నాచును పండిస్తున్న గోదావరి వాసులు !!

క్యాపిటల్ వాయిస్,రాజమండ్రి :- సముద్రంలో పెరిగే నాచును రాష్ట్రం లోనే తొలిసారిగా చెరువుల్లోకి మళ్లించి చక్కగా సాగు చేసే విధానాన్ని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని సముద్రతీర గ్రామాలైన కరవాక-తూర్పుపాలెం లో ప్రయోగాత్మకంగా చేపట్టారు. దాదాపు రెండు సంవత్సరాల నుంచి పరిశోధనల్లో ఉన్న ఇక్కడి సాగులో 3 రకాల నాచు మంచి ఫలితాలను ఇవ్వడం తో మరింత
విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

నాచులో ఎన్నో పోషకాలు : సముద్ర తీరంలోని చెరువుల్లో వినూత్న విధానంలో 3 రకాలైన కప్పాఫైకస్, గ్రాసిలేరియా ఎడ్యులిస్, గ్రాసిలేరియా సాలికోర్నియా అనే నాచును తయారు చేశారు. ఈ నాచులను వివిధ దశల్లో పరిశోధిస్తున్నారు. ఇవి గోధుమ, ఆకుపచ్చ, ఎరుపు,నలుపు రంగుల్లో ఉన్నాయి. అతిచిన్న పరిమాణం నుంచి క్రమేణా పెరుగుతున్నాయి. వీటిలో మెగ్నీషియం, ఇనుము, జింక్‌ వంటి పోషకాలు సహా విటమిన్‌ ఏ, బీ, సీ,కే ఉన్నాయి. వ్యవసాయంలో సేంద్రియ ఎరువుగా, పశుగ్రాసం తో పాటు చేపలు,కోళ్లకు దాణాగానూ ఇది ఉపయోగపడుతుంది. ఆరోగ్య సమస్యలను పూర్తిస్థాయిలో నయం చేయడంలో ఈ నాచు మేలు చేస్తుంది.గోదావరి జిల్లాల్లోని 9 తీర ప్రాంత మండలాల్లో దాదాపు 93 కిలోమీటర్ల మేర విస్తరించిన తీరాన్ని ఆనుకుని ఎక్కువ విస్తీర్ణంలో నాచును సాగు చేసేందుకు అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది.కలెక్టర్‌ మహేశ్‌కుమార్‌ ఇటీవల ఈ ప్రాంతాలను పరిశీలించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతోనూ సాగువిధానం పై సమీక్షించారు. నాచు ఉత్పత్తులకు భవిష్యత్తులో ఎంతో ప్రాధాన్యం ఉన్నందున ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసి గోదావరి జిల్లా వాసులకు ఆదాయం, ఉపాధి కల్పన దిశగా కార్యాచరణకు సిద్ధమవుతున్నారు.నాచు సాగుతో మంచి ఫలితాలు: సముద్రం నీటిని చెరువుల్లోకి మళ్లించి ప్రయోగాత్మకంగా చేపట్టిన నాచు సాగుతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని స్టార్టప్‌ సీవీడ్‌ ఎనర్జీ సీఈవో బి.హరిరామరాజు తెలిపారు. 150 కిలోల నాచును సాగు చేయడం ద్వారా 2 టన్నుల వరకు ఉత్పత్తి వచ్చిందని వెల్లడించారు. తీరంలో ఖాళీగా ఉన్న భూముల్లో ఈ నాచును సాగు చేయడం వల్ల ఎంతో మందికి ఉపాధి, చక్కని ఆదాయం లభిస్తుందని చెప్పారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top